పంటను కాపాడుకుందాం.. వరి కొయ్యల దహనానికి స్వస్తి పలుకుదాం.
హుజూరాబాద్, జూన్ 2(తెలంగాణ ముచ్చట్లు ):
రైతులు వరి కొయ్యలను తగలబెట్టకుండా పర్యావరణ పరిరక్షణతో పాటు భూమి సారవంతతను కాపాడాలని హుజూరాబాద్ బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు ఇటీవల వరి కొయ్యలను దహనం చేసిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల అగ్నిప్రమాదాలు సంభవించి రైతులు కష్టపడి పండించిన ధాన్యం అగ్నికి ఆహుతవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయి రైతులు కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు కలచివేస్తున్నాయని పేర్కొన్నారు.
వరి కొయ్యల దహనం వల్ల భూమి సారవంతత తగ్గిపోవడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి, వరి కొయ్యలను భూమిలో కలపడం ద్వారా నేల సారాన్ని పెంచుకోవచ్చని వివరించాలని సూచించారు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల భవిష్యత్తులో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.
అలాగే విద్యావంతులైన రైతులు తమ గ్రామాల్లో ఇతర రైతులకు వరి కొయ్యల దహనం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యవసాయ భూముల ఉత్పాదకతను కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శులు చిలుకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, నాయకులు మావునూరి ప్రవీణ్ కుమార్, పంజాల వెంకటేశ్వర్లు, నడిగోటి రమేష్, కలకోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments