ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
సీబీఎస్ఈ పర్మిషన్ లేకుండా కార్యకలాపాలు
ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు:
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించాల్సిన అవసరం ఉన్నా, చాలా పాఠశాలలు నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నాయని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక (జెఎసి) పేర్కొంది.
ఈ మేరకు బిఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, జనసేన, బిజెవైయం, ఎస్టీ సెల్ విద్యార్థి సంఘాల ప్రతినిధులు స్టేషన్ ఘనపూర్ మండల విద్యా వనరుల కేంద్రంలోని ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.42 ప్రకారం ఫీజుల నియంత్రణ, సీబీఎస్ఈ అనుమతి, అర్హత గల ఉపాధ్యాయుల నియామకం వంటి అంశాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సీబీఎస్ఈ అనుమతి లేకుండానే ఆ గుర్తింపు ఉన్నట్లు ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయన్నారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే అర్హతలేని పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ లేకుండా, పూర్తిస్థాయి పరిశీలన చేయకుండా అనుమతులు మంజూరవుతున్నాయని ఆరోపించారు.
ఫీజుల విషయంలో పాఠశాలలు 10% నుంచి 20% వరకు ఇష్టానుసారంగా పెంపు చేస్తున్నాయనీ, కేవలం ఎల్కేజీ విద్యార్థులకు కూడా రూ.20,000 దాటిన ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. డొనేషన్ పేరుతో అధిక మొత్తాలు వసూలు చేయడంపై కూడా విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.
విద్యా శాఖ అధికారులు చట్టం అమలు చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తుండటంతో ప్రైవేట్ పాఠశాలలకు ప్రోత్సాహం లభిస్తున్నదని విద్యార్థి సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై విచారణ జరిపి అవసరమైతే వాటిని సీజ్ చేయాలన్నది వారి డిమాండ్.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా యాకన్న రాథోడ్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మహ్మద్ యూనస్, బిజెవైయం రాష్ట్ర నాయకులు కొలనుపాక శరత్ కుమార్, జనసేన మండల అధ్యక్షుడు మునిగాల పవన్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు నూనావత్ జయపాల్ తదితరులు పాల్గొన్నారు
Comments