మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకే డెయిరీ ఏర్పాటు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
పరకాల నియోజకవర్గ మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా తీసుకుని ఏర్పాటు చేయనున్న మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల డెయిరీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మహాజనసభ నిర్వహించబడింది. ఈ సభలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ కలెక్టర్ సత్య శారద, పలు శాఖల అధికారులు, మండలాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.
సభలో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు సంబంధించి రెండు జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో ముందుకు వస్తున్నారని చెప్పారు. ములుకనూర్ మహిళా డెయిరీను ఆదర్శంగా తీసుకుని పరకాల డెయిరీను విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వ్యవస్థ ద్వారా మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. ఎన్డీడీ సహకారంతో డెయిరీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, డెయిరీ నిర్వహణలో ప్రారంభంలో కష్టాలు ఉన్నా పట్టుదల, కృషితో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సరైన నాయకత్వాన్ని ఎంపిక చేసి, ప్రభుత్వం అందించే రుణాలు, ఇతర అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ, మహిళల అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డెయిరీ నిర్వహణను సవాలుగా తీసుకుని క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు.
సభలో పాల్గొన్న పరకాల మండలాల మహిళలు ములుకనూర్ డెయిరీ సందర్శన అనుభవాన్ని పంచుకుంటూ, తమ ప్రాంతంలో కూడా అలాంటి విజయాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అధికారుల సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్యదేవి, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ అధికారులు లత, సుందర్ రావు, పలు శాఖల ప్రతినిధులు, పరకాల మహిళా డెయిరీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments