నకిలీ విత్తనాలు,ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలి
-దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం
-ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
-వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నకిలీ విత్తనాలు, ఎరువుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని మంత్రి పాంగులేటి సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్తో చర్యలు తీసుకోవాలని, ఎవరైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అంచనాలకు మించి 160 శాతం అధికంగా ధాన్యం వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 85 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా సురక్షితంగా కొనుగోలు చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వేగవంతం చేయాలని, జూన్ 6 నాటికి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. ఇసుక ఉచితంగా అందిస్తామని, రవాణా ఖర్చులు లబ్ధిదారులు భరించాల్సిన అవసరం ఉందన్నారు. బఫర్ జాబితా రూపొందించాలని, అత్యంత నిరుపేదలకే మొదటి దశలో ఇళ్లు ఇవ్వాలని సూచించారు.
గ్రామ పాలన అధికారుల నియామకం జూన్ 2న నిర్వహిస్తామని తెలిపారు. సాదా బైనామా అంశంపై కోర్టు సెలవుల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జూన్ 3 నుండి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు, నియోజకవర్గాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నకిలీ విత్తనాల నియంత్రణ కమిటీలో రైతులు భాగస్వాములు కావాలని, టాస్క్ఫోర్స్ నిఘాను మరింత బలపరచాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు — మామిడాల యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి — తమ నియోజకవర్గాల సమస్యలు, అవసరాలపై వివరాలు అందించారు.
హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు జిల్లాల ప్రగతి నివేదికలు సమర్పించారు. వారిలో డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య, రిజ్వాన్ భాషా, టీఎస్ దివాకర్, అద్వైత్ కుమార్ సింగ్, రాహుల్ శర్మలు ఉన్నారు.ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
Comments