యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, గ్రామ పాలన ఆఫీసర్స్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: ఈ నెల 25వ తేదీన జరగనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష, గ్రామ పాలన ఆఫీసర్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, గ్రామ పాలన ఆఫీసర్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సంబంధిత శాఖల ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన జరిగే యూపిఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్, గ్రామ పాలన ఆఫీసర్స్ పరీక్షల నిర్వహణకు కేటాయించిన పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనల మేరకు ఏర్పాట్లు ఉండాలని అన్నారు. పరీక్ష నిర్వహణకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రం వద్ద తగిన పోలీస్ బందోబస్తు ఉండాలన్నారు. రెండు పరీక్షలు నిర్వహణ దృష్ట్యా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఈనెల 25వ ఉదయం 9:30 నుండి 11:30 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం రెండున్నర నుండి 4:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ను 4141 మంది అభ్యర్థులు రాయనున్నారని పేర్కొన్నారు. యూపీఎస్సీ పేర్కొన్న నిర్ణీత సమయంలో పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. అదేవిధంగా ఈనెల 25వ తేదీన గ్రామ పాలన ఆఫీసర్స్ టెస్ట్ 2025 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు గ్రామ పాలన ఆఫీసర్స్ పరీక్ష ఉంటుందన్నారు. 132 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పాలన ఆఫీసర్స్ టెస్ట్ నిర్వహణ కు హనుమకొండ లోని సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, గ్రామ పాలన ఆఫీసర్స్ టెస్ట్ నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై వి గణేష్, యూపీఎస్సీ అధికారి కేశ్ రామ్ మీనా , ఏసిపి నరసింహారావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి గౌరీ శంకర్, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments