ఇందిరా గాంధీని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలి
నిజాంపేటలో జైహింద్ ర్యాలీలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి
–– కేంద్ర నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు
నిజాంపేట,తెలంగాణ ముచ్చట్లు:
భారత సైనికులకు మద్దతుగా ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్వహించిన “జైహింద్” ర్యాలీలో నిజాంపేటలో పీసీసీ నాయకులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ప్రధాన మంత్రి యుద్ధ నిర్ణయానికి సంబంధించి అఖిలపక్షాల అభిప్రాయం తీసుకున్నప్పటికీ, యుద్ధ విరమణ నిర్ణయాన్ని మాత్రం ఏకపక్షంగా తీసుకున్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయం భారత సైనికుల ఆత్మస్థైర్యంపై ప్రభావం చూపిందని పలువురు నాయకులు పేర్కొన్నారు.
ఈ సంధర్బంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ..భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నాయకత్వంలో పాకిస్తాన్ విభజన జరిగి బంగ్లాదేశ్ ఏర్పడిన సంఘటనను గుర్తు చేస్తూ, అదే ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ప్రధానికి ఉందని వ్యాఖ్యానించారు. బలూచిస్తాన్ విషయంలో అదే తీరు చూపలేదని అభిప్రాయపడ్డారు.
యుద్ధంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇచ్చినప్పటికీ, ప్రధాని మాత్రం ‘తిరంగా’ వంటి కార్యక్రమాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలే ప్రధానికి ఆదర్శంగా నిలవాలన్నారు.
Comments