భూభారతి దరఖాస్తుల విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
భూభారతి రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత రైతులకు నోటీసులు అందించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా నడికూడ మండల తహసిల్దార్ కార్యాలయంలో పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ, స్థానిక తహసిల్దార్ రవీందర్ రెడ్డి, సిబ్బందితో భూభారతి దరఖాస్తుల విచారణ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పైలట్ మండలమైన నడికూడ మండలంలోని వివిధ గ్రామాలలో స్వీకరించిన భూభారతి దరఖాస్తుల విచారణ గురించిన వివరాలను అధికారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అధికారులు సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ సదస్సులలో వచ్చిన అన్ని అప్లికేషన్లకు నోటీసులు అందించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలన్నారు. విచారణ అనంతరం తగు ఉత్తర్వులు జారీ చేసి వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అప్లికేషన్ల విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని కేటాయించాలన్నారు. సమీక్ష సమావేశం అనంతరం ఇదే మండలంలోని రాయపర్తి గ్రామంలో భూభారతి దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాటు చేసిన విచారణ బృందం చేపడుతున్న విచారణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ గ్రామానికి చెందిన రైతు రాజేశ్వరరావు తో కలెక్టర్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Comments