ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాణానికి మార్గదర్శకులు
-వరంగల్ ఎంపీ కడియం కావ్య
రఘునాథ్ పల్లి,తెలంగాణ ముచ్చట్లు:
విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించాలి అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. రఘునాథ్పల్లి మండలంలోని నిడిగొండలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే విధంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎంపీ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు.
తరగతుల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్ల వాడకాన్ని నివారించి విద్యార్థులతో మరింత సమయాన్ని గడపాలని సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారిని అన్ని రంగాల్లోప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల జీవితాల్లో టీచర్ పాత్ర గొప్పదైందని పేర్కొంటూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించాలన్నారు.
విద్య ద్వారానే అసమానతలను అధిగమించవచ్చని, విద్యార్థులకు నైపుణ్యాన్ని అందిస్తే వారు భవిష్యత్తులో సూపర్పవర్లుగా ఎదుగుతారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. భోజన్న, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments