ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థిని జశ్విత
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించిన యువతీ


హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ఈ రోజుల్లో పుట్టినరోజు అనగానే కేకులు, పార్టీలు, వేడుకలు గుర్తుకు వస్తున్న వేళ… హనుమకొండకు చెందిన బిటెక్ చదువుతున్న విద్యార్థిని జశ్విత తన పుట్టినరోజును పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. సాధారణంగా జరిగే సంబరాలకు భిన్నంగా, జశ్విత ప్రతి ఏడాది తన పుట్టినరోజున ఒక మొక్కను నాటుతోంది. ఈ చిన్న చర్య వెనుక గొప్ప ఆలోచన దాగి ఉంది – ప్రకృతి పట్ల బాధ్యతా భావం, సమాజానికి మంచి చేయాలనే సంకల్పం.
తన తండ్రి అనగాని రవీందర్ హన్మకొండ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన విధుల్లోగా భాగంగా పలు కార్యక్రమాల్లో (హరితహారం) మొక్కల పట్ల చూపిన శ్రద్ధ జశ్వితకు స్ఫూర్తిగా నిలిచింది. తండ్రి మార్గాన్ని అనుసరిస్తూ, తాను కూడా మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి రక్షణలో తన వంతు పాత్ర పోషించాలనే సంకల్పంతో ముందడుగు వేసింది.
“పుట్టినరోజున కేక్ కోయడం కంటే ఒక మొక్క నాటితే కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. ఒక్కొక్కరు తమ పుట్టినరోజున ఒక్కొక్క మొక్క నాటినా అది భూమికి గ్రీన్ గిఫ్ట్ అవుతుంది. మన తర్వాతి తరాలకు శుభ్రమైన వాతావరణం అందించడంలో ఇది చిన్నపాటి సహాయమే అయినా, దీని ప్రభావం ఎక్కువ,” అని జశ్విత చెప్పింది.
జశ్విత తీసుకున్న ఈ వినూత్న ఆచరణ, ఆమె స్నేహితులకు, తరగతి మిత్రులకు స్ఫూర్తిగా మారింది. ఆమెను అనుసరించి పలువురు యువత మొక్కలు నాటేందుకు ముందుకు వస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ప్రభుత్వానిదే బాధ్యత కాదని, ప్రతి పౌరుడూ ఇందులో భాగస్వామిగా మారాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
ఇలా ఒక చిన్న వయస్సులోనే పెద్ద ఆలోచనలతో ముందుకు సాగుతున్న జశ్విత చర్యలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతిని ప్రేమించడమంటే మాటలు కాదు, ఆచరణలో చూపించాలి అనే సందేశాన్ని ఈ యువతి తన కార్యక్రమం ద్వారా ప్రదర్శిస్తోంది.
పర్యావరణ దినోత్సవం రోజే తన పుట్టినరోజు కావడం,అదే రోజు మొక్కను నాటడం ద్వారా ఆమె తన జీవన విధానాన్ని ప్రకృతికి అంకితమిచ్చినట్లు వెల్లడిస్తోంది.


Comments