విశ్వశాంతి విద్యాలయానికి ఎక్సలెన్సీ పురస్కారం.
సత్తుపల్లి, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రెయిన్ ఫీల్డ్ సంస్థ 2025–26 విద్యా సంవత్సరానికి గాను స్థానిక విశ్వశాంతి విద్యాలయాన్ని ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాదు హైటెక్స్లో శనివారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో విశ్వశాంతి విద్యాలయం యాజమాన్యం పసుపులేటి నాగేశ్వరరావు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం, అంకితభావంతో పనిచేయడం, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం పాటుపడడం, వారిలో స్ఫూర్తిని నింపే విధంగా విద్యాబోధన చేయడం వంటి అంశాలలో విశేష ప్రతిభ కనబరుస్తున్న విద్యాసంస్థలను గుర్తించి ఈ అవార్డులు అందజేస్తున్నట్లు బ్రెయిన్ ఫీల్డ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రైవేట్ విద్యాసంస్థల సంఘ రాష్ట్ర నాయకులు పాల్గొని వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. ఆధునిక విద్యా రంగ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ స్టాల్స్ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.


Comments