ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ -14(తెలంగాణ ముచ్చట్లు)
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ఖమ్మం జిల్లాలోని 6 మండలాల్లో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రెండవ విడత 160 గ్రామ పంచాయతీలకు, 1379 వార్డులకు నిర్వహించిన పోలింగ్ లో 91.21 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ఉదయం 9 గంటల వరకు 27.78 శాతం, 11 గంటలకు 64.32 శాతం, 1 గంట వరకు 85.95 శాతం పోలింగ్ నమోదైందని, ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, వారితో కలిపి మొత్తం ఖమ్మం జిల్లాలో 91.21 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. రెండవ విడత పోలింగ్ నిర్వహించిన కామేపల్లి మండలంలో 87.03 శాతం, ఖమ్మం రూరల్ మండలంలో 93.76 శాతం, కూసుమంచి మండలంలో 90.92 శాతం, ముదిగొండ మండలంలో 91.52 శాతం, నేలకొండపల్లి మండలంలో 91.69 శాతం, తిరుమలాయపాలెం మండలంలో 91.57 శాతం పోలింగ్ నమోదైందని, మొత్తం 2 లక్షల 48 వేల 239 మంది ఓటర్లకు గాను 2 లక్షల 26 వేల 417 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని, మొత్తంగా రెండవ విడతలో 91.21 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కలెక్టర్ అన్నారు.
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కలెక్టరేట్ నుంచి నిరంతరం మానిటరింగ్ చేయడం జరిగిందని, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కౌంటింగ్ ముగిసిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా 6 మండలాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, సిపిఓ ఏ. శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాస రావు, రెవెన్యూ సిబ్బంది,
టెక్నికల్ టీం సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments