ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!
ముఖ్య అతిథిగా కూసంపుడి మధుసూదనరావు.
సత్తుపల్లి, డిసెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పట్టణంలో ఉన్న తేజ ఒకేషనల్ అండ్ పారామెడికల్ కళాశాలలో ఆరవ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ విద్యాసంస్థల కరస్పాండెంట్ కూసంపుడి మధుసూదనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్ ప్రతినిధిగా కూసంపుడి మధుసూదనరావు, చైర్మన్ జి. వీరారెడ్డి, డైరెక్టర్లు జి. శ్రీనివాసరావు, జి. శ్రీ వాణి, తేజ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. ప్రభాకరరావు, గాయత్రి కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. సుబ్బారావు, కాకతీయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ బి. గౌతమి, డైరెక్టర్ పి. ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి మధుసూదనరావు మాట్లాడుతూ, విద్యార్థులు తమ భవిష్యత్తును ముందుగానే నిర్ణయించుకొని వృత్తి విద్య కోర్సుల్లో చేరడం అభినందనీయమని తెలిపారు. నర్సింగ్ వృత్తి అత్యంత బాధ్యతాయుతమైనదని, నిబద్ధతతో పనిచేసినప్పుడే రోగులకు నాణ్యమైన సేవ అందించగలమన్నారు. నర్సులు రోగులకు ప్రత్యక్ష దైవాల్లాంటివారని, వృత్తిలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. కాబట్టి మరింత ప్రావీణ్యత సాధించి, సమాజానికి ఉత్తమ సేవలు అందించాలని పిలుపునిచ్చారు. చైర్మన్ జి. వీరారెడ్డి మాట్లాడుతూ, సమాజాభివృద్ధికి నర్సుల సేవలు అత్యంత అవసరమని అన్నారు. డైరెక్టర్ పి. ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, నర్సులు ధరించే తెల్ల కోటుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, తెలుపు శాంతి, సమాధానానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి నర్సు ప్రశాంత మనసుతో సేవలు అందించాలని కోరారు. డైరెక్టర్ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు సభను ఉత్సాహంగా నింపాయి.


Comments