రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.....
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, డిసెంబర్- 12(తెలంగాణ ముచ్చట్లు)
రెండవ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయ పాలెం మండలాల పరిధిలో ఉన్న 183 గ్రామ పంచాయతీలు, 1686 వార్డులకు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించామని అన్నారు.
ఒక వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదని, 23 గ్రామ పంచాయతీలు, 306 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన 160 గ్రామ పంచాయతీలకు మొత్తం 451 మంది, 1379 వార్డులకు మొత్తం 3352 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని అన్నారు. ఈ నెల 14న ఆదివారం రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు 2023 బ్యాలెట్ బాక్సులు, 1831 పోలింగ్ అధికారులు, 2346 మంది ఓపిఓ లను సిద్ధం చేశామని అన్నారు.
రెండవ విడతలో 28 లొకేషన్స్ లో 304 క్రిటికల్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ సిసి కెమేరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పటిష్ట బందోబస్తు చేపట్టామన్నారు. రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో మొత్తం 2 లక్షల 51 వేల 327 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నట్లు, ఇందులో లక్షా 21 వేల 164 మంది పురుష, లక్షా 30 వేల 156 మంది మహిళా, 7 గురు ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా వినియోగించుకొని ప్రజాస్వామ్య స్పూర్తిని చాటాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Comments