ఆశాలపై పని భారం తగ్గించాలి : సీఐటీయూ డిమాండ్
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ – సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు భారీ ధర్నా నిర్వహించారు.
ఆశాలపై పెరుగుతున్న పని భారం తగ్గించాలి, వేధింపులు ఆపాలని, పెట్టి చాకిరి చేయించకూడదని డిమాండ్ చేశారు. బాలానగర్ పీహెచ్సీలో పనిచేసిన ఏడుగురు ఆశాలకు వెంటనే జీతాలు చెల్లించాలని, దుర్భాషలాడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాకు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ కె. ఉన్నికృష్ణన్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ పనుల పేరుతో ఆశా వర్కర్లను దుర్భాషలాడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ సమస్యను డీఎం అండ్ హెచ్వో దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టాలని, 22వ తేదీ సోమవారం భారీ ధర్నా నిర్వహించాలని యూనియన్ నిర్ణయించింది.సీఐటీయూ జిల్లా నాయకుడు ఎం. కిష్టప్ప మాట్లాడుతూ మహిళా కార్మికులను అధికారులు వేధిస్తే సీఐటీయూ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. 30 రోజులు పనిచేయించి జీతం ఇవ్వకపోవడం వెట్టిచాకిరి కాదా అని ప్రశ్నించారు. ఆన్లైన్ పనులకు ఫోన్, నెట్ రీచార్జ్, శిక్షణ ఇవ్వకుండా పని చేయమంటే ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం. రేవతి, కోశాధికారి రాధా, నాయకులు లత, జయప్రద, కవితతో పాటు కీసర, చర్లపల్లి, మల్లాపూర్ ప్రాంతాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


Comments