కెసిఆర్,హరీష్ సంతకాలే తెలంగాణకు మరణ శాసనం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-తెలంగాణకు గోదావరి,కృష్ణా జలాల్లో హక్కుల సాధన దిశగా స్పష్టమైన కార్యాచరణ
-తెలంగాణ జలాల విషయంలో రాజీ పడేది లేదు
-నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ప్రజా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణకు గోదావరి, కృష్ణా నదుల జలాల్లో న్యాయమైన హక్కులు, కేటాయింపులు లభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నికర జలాలపై కేటాయింపులు జరిగిన తరువాతే మిగులు, వరద జలాల అంశానికి పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. మిగులు జలాలపై కూడా రెండు రాష్ట్రాలకు నిష్పత్తి ప్రకారం వాటాలు ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
పూలె ప్రజాభవన్లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి–కృష్ణా బేసిన్లో తెలంగాణ హక్కులపై చారిత్రక పరిణామాలు, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రమాణాలు, ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న చట్ట విరుద్ధ ప్రాజెక్టుల వివరాలు, వాటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన చొరవలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రాల మధ్య జలవివాదాలకు పరిష్కారం కోసం కేంద్రం పెద్దన్నగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం పాత్ర పోషించకుండా వివాదాలను పెంచేలా వ్యవహరించడం సరైనదికాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఖచ్చితంగా జరిగితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కేంద్రంపై అన్ని విధాల ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ నిర్మించనున్న ప్రాజెక్టులకు చట్టబద్ధమైన నికర జలాల కేటాయింపులు ముందుగా జరిగేలా చూడాలని, ఆ తర్వాత మిగులు, వరద జలాల అంశాన్ని తేల్చుకోవచ్చని చెప్పారు. మిగులు జలాల అంశంలోనూ రాష్ట్రానికి నిష్పత్తి ప్రకారం హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మాత్రమే మిగులు జలాల లెక్కలు తెలుస్తాయని వివరించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కేటాయింపుతో పాటు ఇతర ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒకవైపు తెలంగాణ నికర జలాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, మరోవైపు మిగులు జలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు నిర్మించడం అన్యాయమని విమర్శించారు.
తెలంగాణ హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికంగా, రాజకీయంగా, న్యాయపరంగా సమయానుకూలంగా పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తీసుకున్న అనేక నిర్ణయాలు రాష్ట్రానికి విఘ్నంగా మారిన విషయంలో అసహనం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో నికర జలాలపై జరిగిన స్పష్టమైన కేటాయింపులను గుర్తు చేస్తూ, విభజన అనంతరం ప్రాజెక్టులను పూర్తిచేయకుండా, అవసరమైన అనుమతులు తెచ్చుకోకుండా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ రోజు ఈ స్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.
ఈ సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల చర్చలు అవసరమని, తుది స్థాయిలో అపెక్స్ కమిటీ సమక్షంలో చర్చించి మార్గం కనుగొనాల్సి ఉంటుందని తెలిపారు. సాంకేతిక అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయ అంశాలను ప్రజల ముందు, న్యాయపరమైన అంశాలను న్యాయస్థానాల్లో ఉద్యమరూపంలో తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రజలందరికి ఈ వాస్తవాలను వివరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు,
ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు,అధికారులు,కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
Comments