గులాబీ గర్జనతో మారుమోగిన జమ్మికుంట.. హరీశ్ సభకు పోటెత్తిన జనసందోహం.
- ఎంఎఫ్ఆర్ గార్డెన్స్లో కిక్కిరిసిన సభా ప్రాంగణం
- సభ్యత్వ నమోదు కార్యక్రమంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
- మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్న నేతల ధీమా
జమ్మికుంట టౌన్ జూన్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణం శుక్రవారం గులాబీ రంగులో మునిగిపోయింది. ఎంఎఫ్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఓటరు నమోదు అవగాహన సభకు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
సభా ప్రాంగణం నిండా గులాబీ జెండాలు రెపరెపలాడగా, కార్యకర్తల నినాదాలతో ప్రాంతం మారుమోగింది.
మాజీ మంత్రి హరీశ్ రావు సభా వేదికపైకి చేరుకోగానే కార్యకర్తలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు సభను విజయవంతం చేయడంతో జమ్మికుంటలో బీఆర్ఎస్ బలం మరోసారి స్పష్టంగా కనిపించింది.
ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవానికి బీఆర్ఎస్ ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన నుంచి అభివృద్ధి వరకు ప్రతి అడుగులోనూ బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణ పునర్నిర్మాణానికి ఆయన నాయకత్వమే సరైన మార్గమని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, ఎరువుల సరఫరా, సాగునీటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోందన్నారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఆయన, ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, రానున్న రోజుల్లో గులాబీ జెండా మరింత బలంగా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, రాకేష్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.


Comments