ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం... స్థానిక మహిళలకు ఉద్యోగ అవకాశం.
- మండల విద్యాధికారి మంజులత.
పెద్దమందడి,జూన్07(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) విద్యను ప్రవేశపెడుతున్నట్లు మండల విద్యాధికారి మంజులత తెలిపారు.మండలంలోని ప్రాథమిక పాఠశాల పెద్దమందడి, ప్రాథమిక పాఠశాల మోజర్ల, ప్రాథమికోన్నత పాఠశాల అమ్మపల్లి, ప్రాథమిక పాఠశాల గట్లఖనాపూర్ పాఠశాలల్లో ఈ విద్యా విధానం అమలు కానుందని వెల్లడించారు.ఈ నాలుగు పాఠశాలల్లో ఆయాలు మరియు బోధకులు (ఇన్స్ట్రక్టర్లు)గా పనిచేయడానికి అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.ఆయా పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత, బోధకుల పోస్టులకు ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత విద్యార్హతగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల విద్యాధికారి కార్యాలయం (ఎంఆర్సీ), పెద్దమందడిలో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నాలుగు సంవత్సరాలు, మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.డిప్లొమా ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, నర్సరీ టీచింగ్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (నర్సరీ) వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సమర్పించాలని మండల విద్యాధికారి మంజులత కోరారు.


Comments