జమ్మికుంటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
12, 23, 24, 26 వార్డు సభల్లో మున్సిపల్ చైర్మన్ దిలీప్.
జమ్మికుంట టౌన్ జూన్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జమ్మికుంట పట్టణంలోని పత్తిదారుల సంఘం భవనంలో నిర్వహించారు. 12, 23, 24, 26 వార్డులకు సంబంధించిన వార్డు సభలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబం తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ చెత్త వాహనాలకు అందించాలని, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు వంటి వ్యర్థాలను డ్రైనేజీల్లో వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. "అమ్మ మనకు జన్మనిస్తే, మొక్కలు పునర్జన్మనిస్తాయి" అంటూ మొక్కల ప్రాధాన్యతను వివరించారు.
సభలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2026, "జల్ సంచయ్ - జల్ భాగీధారి" కార్యక్రమం కింద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, డ్రైన్ల పూడికతీత, రుతుపవనాల సన్నద్ధత, త్రాగునీటి సరఫరా, నీటి నిల్వ నివారణ, పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ, వీధి దీపాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు.
ఐసీడీఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, చిన్నారుల ఎదుగుదల, గర్భిణులు మరియు బాలింతల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఎన్పీడీసీఎల్ ఏఈ మాట్లాడుతూ విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రతి వార్డుకు లైన్మ్యాన్, జేఎల్ఎం అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఆరోగ్య శాఖ అధికారులు వేసవి కాలంలో వడదెబ్బ నివారణ చర్యలపై సూచనలు చేస్తూ, ఎండ సమయంలో బయటకు వెళ్లే వారు తగినంత నీరు త్రాగాలని, వడదెబ్బ కారణంగా మరణాలు సంభవిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు మొలుగు ప్రణీత, చుంచు రమాదేవి, దిడ్డి కోమల, దిడ్డి రాము, గడ్డం దీక్షిత్, వినయ్, సీఏల్పీలు, ఆర్పీలు, సీపీడీఎల్ ఏఈ, ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, వార్డు పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.


Comments