నమ్మిన చోట గౌరవం దక్కకపోవడం దురదృష్టకరం .
ఎల్కతుర్తి, జూన్ 3( తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా విశేష అనుభవం కలిగి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన సీనియర్ నాయకుడు టి. జీవన్రెడ్డి ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి బాధాకరమని ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన శనిగరపు వెంకటేశ్ అన్నారు.
ఆయన మాట్లాడుతూ, ప్రజల కోసం జీవితాంతం కష్టపడి పనిచేసిన నాయకుడికి నమ్మకంతో వెళ్లిన చోట కనీస గౌరవం కూడా దక్కకపోవడం దురదృష్టకరమన్నారు. అభిమానులు, కార్యకర్తలు పలుమార్లు సూచనలు చేసినప్పటికీ ఆయన తన రాజకీయ విశ్వాసంతో ముందుకు సాగారని, అయితే ఆశించిన గుర్తింపు, గౌరవం లభించలేదనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గంటల తరబడి చర్చించి, ప్రజల తరఫున గళమెత్తిన నాయకుడిగా జీవన్రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని వెంకటేశ్ పేర్కొన్నారు. అలాంటి అనుభవజ్ఞుడైన నాయకుడిని రాజకీయంగా పక్కన పెట్టడం బాధాకరమని అన్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో కుటుంబ సభ్యులకు, వారసత్వ రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుండగా, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు దక్కకపోవడం విచారకరమన్నారు. ఇటీవల జీవన్రెడ్డి ఎదుర్కొంటున్న పరిస్థితులపై పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చూసి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికైనా టి. జీవన్రెడ్డి వంటి సీనియర్ నాయకుల అనుభవాన్ని గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించాలని, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన నాయకులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని శనిగరపు వెంకటేశ్ అన్నారు.


Comments