శ్రీకర్ మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆరోపణలు అవాస్తవం!
రైతుల ఘాటు కౌంటర్.
దమ్మపేట, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండల పరిధిలోని ముద్దులగూడెం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతులు ధారా ప్రసాద్ చేసిన నకిలీ విత్తనాల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. శ్రీకర్ మొక్కజొన్న విత్తనాల ఆర్గనైజర్ బొబత్తుల శివ నాగరాజుకు మద్దతుగా నిలిచిన రైతులు, తమకు అందించిన శ్రీకర్-161 మొక్కజొన్న విత్తనాల్లో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన 29 మంది రైతులు సుమారు 350 ఎకరాల్లో శ్రీకర్-161 మొక్కజొన్న విత్తనాలను సాగు చేశారని, ధారా ప్రసాద్ మినహా మిగిలిన రైతులందరికీ ఆశించిన మేర దిగుబడులు వచ్చాయని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో లేదా ఇతర అంశాలతో వచ్చిన సమస్యలను విత్తనాల నాణ్యతకు ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి అవసరమయ్యే వ్యవసాయంలో బ్యాంకులు సైతం పలు హామీలు కోరుతున్న పరిస్థితుల్లో, ఎలాంటి పూచీకత్తు లేకుండా చిన్న, సన్నకారు, కౌలు రైతులకు పెట్టుబడులు సమకూరుస్తున్న ఆర్గనైజర్లపై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ధారా ప్రసాద్ వంటి వ్యక్తుల ఆరోపణల కారణంగా భవిష్యత్తులో రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోతే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ ఆరోపణలతో రైతులను, ఆర్గనైజర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.


Comments