నాణ్యమైన విద్యతో ప్రభుత్వ బడులపై పెరుగుతున్న విశ్వాసం.
హెడ్మాస్టర్ ఎల్. మనోహర్ నాయక్ .
ఎల్కతుర్తి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని భావుపేట కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఎల్. మనోహర్ నాయక్ అన్నారు. బుధవారం ఎల్కతుర్తి మండలంలోని భావుపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడీడు పిల్లలను వంద శాతం ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రీ-ప్రైమరీ విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పలు సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరిచి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరయ్య చారి, ఉపాధ్యాయులు శ్రీధర్, అనిత, ముకుందరెడ్డి, సుధాకర్, మోహనరావు, సునీత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సీఆర్పీ మర్రి రవికుమార్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments