చేప పిల్లల సరఫరాలో అక్రమాలపై ఆగ్రహం.
ఎల్కతుర్తి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
చేప పిల్లల సరఫరాలో జరుగుతున్న అక్రమాలు, జాప్యాలపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని చేప పిల్లల సరఫరా వల్ల మత్స్యకార సహకార సంఘాలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయని కేశవపూర్ గ్రామ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు పోలు కోటేశ్వర్ ముదిరాజ్ అన్నారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమం సకాలంలో నిర్వహించకపోవడం, సరఫరా చేసే చేప పిల్లల నాణ్యత లోపించడం వల్ల మత్స్యకార కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. చేప పిల్లల సరఫరాలో బ్రోకర్లు, దళారులు, కాంట్రాక్టర్ల ప్రమేయం పెరగడంతో సహకార సంఘాలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు.
చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా చేప పిల్లలను పంపిణీ చేయడం కంటే సంబంధిత నిధులను నేరుగా మత్స్యకార సహకార సంఘాలకు అందజేస్తే, సంఘాలే నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని సూచించారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గి మత్స్యకారులకు నేరుగా లాభం చేకూరుతుందని తెలిపారు.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చేప పిల్లల సరఫరాలో పారదర్శకత తీసుకురావడంతో పాటు మత్స్యకార సహకార సంఘాలను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని పోలు కోటేశ్వర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


Comments