వర్షాలు రాకముందే అప్రమత్తం.. ప్రజల రక్షణకు రంగంలోకి మున్సిపల్ చైర్మన్.
జమ్మికుంట టౌన్ జూన్ 03 (తెలంగాణ ముచ్చట్లు):
రానున్న వర్షాకాలంలో వరద నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జమ్మికుంట పట్టణంలోని పలు వార్డుల్లో కచ్చా కాలువల శుభ్రపరిచే పనులను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ బుధవారం ప్రారంభించారు.
పట్టణ పరిధిలోని ధర్మారం, కొత్తపల్లి ప్రాంతాల్లో ప్రతి వర్షాకాలంలో వరద నీరు నిల్వ ఉండటంతో గృహవాసులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాలువల తవ్వకం, శుభ్రపరిచే పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ పనుల కోసం ప్రైవేటు జేసీబీని లీజుకు తీసుకుని ప్రత్యేకంగా కాలువల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడమే లక్ష్యమని చైర్మన్ తెలిపారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి మూడు నెలలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకవర్గం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పోలు దివ్య బిక్షపతి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments