బోర్నపల్లిలో షార్ట్ సర్క్యూట్తో దాదాపు 25 ఎకరాల వరి కొయ్యలు దగ్ధం.
బావి వద్ద విద్యుత్ వైర్లు, పైపులు కూడా కాలిపోవడంతో రైతులకు భారీ నష్టం
హుజూరాబాద్,జూన్3(తెలంగాణ ముచ్చట్లు )
మండలంలోని బోర్నపల్లి గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వరి కొయ్యలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
స్థానికుల సమాచారం ప్రకారం, విద్యుత్ తీగల్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి వేగంగా పొలాల్లో వ్యాపించాయి. ఎండగాలుల కారణంగా మంటలు మరింత ఉధృతమై వరి కొయ్యలను కాల్చివేశాయి. అగ్నిప్రమాదం సమయంలో వ్యవసాయ బావి వద్ద ఉన్న విద్యుత్ వైర్లు, పైపులు కూడా కాలిపోవడంతో రైతులకు అదనపు నష్టం వాటిల్లింది.
సమాచారం అందుకున్న రైతులు, గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. వారి అప్రమత్తతతో మంటలు మరింత విస్తరించకుండా నిలువరించగలిగారు.
ఈ ప్రమాదంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, సంబంధిత అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని గ్రామస్థులు, రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.


Comments