ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించండి.
విద్యార్థుల చేరికల కోసం బడిబాట ర్యాలీ.
దమ్మపేట, జూన్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండల పరిధిలోని ముద్దులగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాల్లో విద్యాబోధన, విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, మధ్యాహ్న భోజనం తదితర సంక్షేమ పథకాలు అందించబడుతున్నాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బడిబాట ర్యాలీ నిర్వహించి, పాఠశాల వయస్సు కలిగిన విద్యార్థుల వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జగపతి, ముద్దులగూడెం ఎస్టీ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, సర్పంచ్ బేతం రుక్మిణి, వార్డు సభ్యురాలు కూరం సరస్వతి, వైద్య శాఖ సిబ్బంది సుజాత, వీఆర్వో రామకృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువత మరియు నాయకులు పాల్గొన్నారు.


Comments