రాయి పని చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడి మృతి.
వడ్డెర కులవృత్తిదారులకు భద్రత, ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి
-- వడ్డెర సంఘం
వనపర్తి,జూన్04(తెలంగాణ ముచ్చట్లు):
రాయి పని చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడిన ఓ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వనపర్తి మండలం రాజనగరం (వడ్డెగిరి) గ్రామంలో చోటుచేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజనగరం (వడ్డెగిరి) గ్రామానికి చెందిన వడ్డే దాసర్ల సత్యం మే 21న ఎప్పటిలాగే తన కులవృత్తిలో భాగంగా రాయి పని చేసేందుకు సమీపంలోని కొండలయ్య గుట్టకు వెళ్లాడు.పని చేస్తున్న సమయంలో రాయిని గడ్డపారతో జరుపుతుండగా అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది.దీంతో ఆయన అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు.సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గుట్ట వద్దకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉన్న సత్యంను గుర్తించారు.వెంటనే అంబులెన్స్ ద్వారా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ జూన్ 3న ఆయన మృతి చెందారు.ఈ ఘటనపై వనపర్తి జిల్లా వడ్డెర సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.రాయి పనులు చేస్తూ అనేక మంది వడ్డెర కార్మికులు ప్రమాదాలకు గురై అవయవాలు కోల్పోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.ఇప్పటికైనా ప్రభుత్వాలు వడ్డెర కులవృత్తిదారుల సమస్యలను గుర్తించి, ప్రత్యేక సంక్షేమ పథకాలు, బీమా సదుపాయాలు, భద్రతా చర్యలు కల్పించి వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు దాసర్ల భూమయ్య కోరారు.


Comments