ప్రశ్నిస్తారనే భయంతోనే నిర్బంధాలు సీఎం పర్యటనపై నిరంజన్ రెడ్డి విమర్శలు.
వనపర్తి,జూన్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన నేపథ్యంలో తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు.సీఎం పర్యటన పేరుతో చేపడుతున్న నిర్బంధాలను వెంటనే నిలిపివేసి, అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలు చెప్పాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజలు, రైతులు తమ సమస్యలను ప్రస్తావిస్తారనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా నిర్బంధిస్తున్నారని ఆరోపించారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం వాటి పరిష్కారంపై దృష్టి సారించడం లేదన్నారు.ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కల్లాల్లో ధాన్యం అలాగే ఉండిపోయిందని, రైతు భరోసా సహా పలు హామీల అమలుపై రైతుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు.ఇలాంటి సమస్యలపై ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి హెలికాప్టర్ పర్యటనలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల వద్దకు వెళ్లని పాలకులు ఇప్పుడు పర్యటనల పేరుతో హడావుడి చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని అన్నారు.పాలమూరులో జరుగుతున్న ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాకుండా రాజకీయ ప్రచారం కోసమేనని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని, ప్రభుత్వం ఏదో మార్పు తీసుకొస్తుందన్న భ్రమలో తెలంగాణ ప్రజలు ఇక లేరని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రజా తీర్పుతో పరాభవం తప్పదని హెచ్చరించారు.


Comments