వర్షాకాలానికి ముందస్తు చర్యలు చేపట్టాలి!
విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచన.
సత్తుపల్లి, జూన్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ అంతరాయాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె విద్యుత్ శాఖ పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్ఈ, డీఈలతో పాటు ఐదు మండలాల ఏఈలు, ఏడీఈల నుంచి నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ సరఫరా పరిస్థితులు, పెండింగ్ పనులు, గృహజ్యోతి పథకం అమలు, వినియోగదారులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ కూడా సమావేశంలో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం, స్తంభాలు దెబ్బతినడం, ట్రాన్స్ఫార్మర్లు నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుగానే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అత్యంత కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లు, స్తంభాలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెంటనే పరిష్కరించాలని సూచించారు. రైతులు విద్యుత్ సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గృహజ్యోతి పథకం అమలు తీరుపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాల వివరాలు, అర్హులైన లబ్ధిదారులకు అందుతున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా విద్యు
త్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ స్పష్టం చేశారు.


Comments