ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి.. 14, 30వ వార్డుల్లో వార్డు సభలు.

హుజూరాబాద్, జూన్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారాలు చూపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమానికి హుజూరాబాద్ మున్సిపాలిటీలో విశేష స్పందన లభిస్తోంది. 99 రోజుల కార్యాచరణలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 14వ, 30వ వార్డుల్లో నిర్వహించిన వార్డు సభలు విజయవంతంగా సాగాయి.
ముఖ్య అతిథిగా ఆర్డీఓ రమేష్ హాజరై ప్రజల సమస్యలను స్వయంగా విని, సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలు, అభివృద్ధి అవసరాలు, మౌలిక వసతుల కొరత తదితర అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను సంబంధిత అధికారులు నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. 14వ వార్డులో జరిగిన సభలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వార్డు సభలు ఉపయోగపడుతున్నాయని చైర్పర్సన్ సుహాసిని పేర్కొన్నారు.
30వ వార్డులో నిర్వహించిన సభకు మహిళలు, యువత, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సభ అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, మున్సిపల్ కమిషనర్ బి. కిషన్ కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళల సంక్షేమం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పట్టణాభివృద్ధిని మరింత వేగవంతం చేయడం, స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ప్రధాన లక్ష్యమని ఆర్డీఓ రమేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక నాయకులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు చేరువగా పరిపాలనను తీసుకెళ్లడంలో ఈ వార్డు సభలు కీలకంగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.


Comments