మంగంపల్లిని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.
వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి.
పెద్దమందడి,జూన్04(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. మంగంపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి పక్కా ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఇప్పటికే గ్రామంలో గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తయిందని చెప్పారు.గ్రామాభివృద్ధికి తన వంతుగా రూ.10 లక్షలు కేటాయిస్తానని, మరో రూ.10 లక్షలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. గ్రామంలో ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.బాల్యవివాహాల నిర్మూలన, ఓటరు జాబితా సవరణ, వర్షాకాలంలో పరిశుభ్రత, జల సంరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు.అనంతరం ముఖ్య అతిథులు గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీడీవో పరిణత, ఎస్సై జలంధర్ రెడ్డి, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments