కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్వో.
హన్మకొండ,జూన్10(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.డి. రాంకుమార్ కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అవుట్ పేషంట్ విభాగం, ప్రయోగశాల, ప్రసవ గదిని పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆసుపత్రిలో అందిస్తున్న ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండటానికి గల కారణాలను వైద్యాధికారి, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీకి ఆరు కిలోమీటర్ల పరిధిలో ప్రధాన ఆసుపత్రులు అందుబాటులో ఉండటంతో గర్భిణులు అక్కడికే వెళ్తున్నట్లు సిబ్బంది వివరించగా, కనీసం మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించి పీహెచ్సీలో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు.
అనంతరం నేచురోపతి డిస్పెన్సరీని సందర్శించిన ఆయన, మొదటి త్రైమాసిక గర్భిణులకు ప్రతిరోజు కనీసం గంటసేపు సులభమైన వ్యాయామాలు నేర్పించాలని శిక్షకుడికి సూచించారు. అలాగే రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా వారు చేయగలిగే సులభమైన వ్యాయామాలను నేర్పించాలని తెలిపారు. దీంతో ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు పెంపొందుతాయని పేర్కొన్నారు.30 ఏళ్లు పైబడిన 30,721 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటివరకు 15,167 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు. మిగిలిన వారందరికీ కూడా పరీక్షలు పూర్తి చేసి ప్రభుత్వ వైద్య సేవలు, మందులను వినియోగించుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.
వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతి నివేదికలను పరిశీలించిన డీఎంహెచ్వో, కొన్ని అంశాల్లో లక్ష్యాలకు వెనుకబడినట్లు గమనించి తదుపరి తనిఖీ నాటికి పూర్తి స్థాయి లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై వారి విధులు, పనితీరును సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ఎన్సీడీ కార్యక్రమ అధికారి డాక్టర్ శ్రీనివాస్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ ఇర్ఫాన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.


Comments