ఇందిరమ్మ విగ్రహం పునఃస్థాపనకు కాంగ్రెస్ డిమాండ్.
హుజూరాబాద్, జూన్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
హుజూరాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద గోల్డెన్ పాన్ షాప్ ప్రాంతంలో గతంలో తొలగించిన ఇందిరమ్మ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సొల్లు బాబు డిమాండ్ చేశారు.
ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, దాదాపు పదేళ్ల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ఇందిరమ్మ విగ్రహాన్ని తొలగించారని గుర్తు చేశారు. పనులు పూర్తయిన తర్వాత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేస్తామని అప్పటి మున్సిపల్ పాలకవర్గం హామీ ఇచ్చినా, ఆ హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ప్రస్తుత రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం గతంలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ విగ్రహ పునఃస్థాపన జరగలేదన్నారు.
ప్రస్తుతం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల్ల ప్రణవ్ చొరవ తీసుకుని మున్సిపల్ పాలకవర్గంతో చర్చించి, అంబేద్కర్ కూడలి వద్దనే ఇందిరమ్మ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సొల్లు బాబు కోరారు.
హుజూరాబాద్ ప్రజల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఇందిరమ్మ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించడం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన అన్నారు.


Comments