దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి!
ప్రజలకు ఇన్స్పెక్టర్ టి. శ్రీహరి సూచన.
సత్తుపల్లి, జూన్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
జిల్లాలో రాత్రి వేళల్లో ఇంటి దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి. శ్రీహరి సూచించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎండల కారణంగా పలువురు ఇంటి బయట వరండాల్లో నిద్రిస్తున్న నేపథ్యంలో ఇంటి తలుపులకు తప్పనిసరిగా తాళాలు వేయాలని సూచించారు. ప్రధాన ద్వారం, వెనుక ద్వారం, అల్మారాలకు తాళాలు సరిగా ఉన్నాయో లేదో ప్రతిరోజూ పరిశీలించుకోవాలని తెలిపారు. బంగారం, నగదు, విలువైన పత్రాలను బ్యాంకు లాకర్లలో భద్రపరచడం మంచిదని పేర్కొన్నారు. ఇంటి బయట, మెట్ల వద్ద, పెరట్లో రాత్రి వేళల్లో లైట్లు వెలిగించి ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్–100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు ఇన్స్పెక్టర్ టి. శ్రీహరి తెలిపారు. బీట్ పెట్రోలింగ్, బ్లూ కోల్ట్ సిబ్బందితో గ్రామాలు, కాలనీల్లో నిఘా పెంచినట్లు చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బేతుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సత్తుపల్లి ఎస్ఐ అశోక్ కుమార్ ప్రజలు దొంగతనాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్డ రాజేంద్ర ప్రసాద్ (అమ్ములు), గ్రామ సెక్రటరీ, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


Comments