రుద్రభూమిలో నాలుగు గదుల నిర్మాణానికి భూమిపూజ.
రూ.1 లక్ష విరాళం ప్రకటించిన చైర్మన్ దిలీప్ .
జమ్మికుంట టౌన్ జూన్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంట రోడ్డులో ఉన్న హిందూ రుద్రభూమి (స్మశాన వాటిక)లో దహన సంస్కారాలు నిర్వహించుకునే ప్రజల సౌకర్యార్థం నాలుగు గదుల నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వైశ్యుల స్మశాన వాటికగా ఉన్న ఈ రుద్రభూమిని పట్టణ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చిన వైశ్య పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పెరుగుతున్న జనాభా, మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్మశాన వాటికలో మరిన్ని సౌకర్యాలు కల్పించడం అవసరమైందన్నారు.
ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి జమ్మికుంటకు వచ్చి అద్దె ఇళ్లలో నివసించే కుటుంబాలు, తమ కుటుంబ సభ్యుల మరణం సంభవించినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలు అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలను గౌరవప్రదంగా నిర్వహించుకునేందుకు ఈ గదులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ గదుల నిర్మాణానికి వైశ్య పెద్దలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్న చైర్మన్, విదేశాల్లో స్థిరపడిన జమ్మికుంట వాసులు, స్థానిక దాతలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మున్సిపల్ పక్షాన తాను వ్యక్తిగతంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు, వైశ్య సంఘ పెద్దలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Comments