ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం.
జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసిన ఎమ్మెల్యే జారె.
అశ్వారావుపేట, జూన్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభినందించారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఇంపాక్ట్, తొలి అడుగు ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన విజయాలు గర్వకారణమన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. వారి భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పర్సా వెంకట్, సీనియర్ నాయకుడు బానోత్ భీముడు, ఇంపాక్ట్, తొలి అడుగు ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments