ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల భవిష్యత్కు బాటలు.
ప్రధానోపాధ్యాయుడు వరప్రసాద్రావు.
పెద్దమందడి,జూన్04(తెలంగాణ ముచ్చట్లు):
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల-మోజర్ల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్రావు గురువారం మద్దిగట్ల గ్రామపంచాయతీ సమావేశంలో పాల్గొన్నారు.బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ఉచిత నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ తరగతులు, వ్యాయామ విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, కుట్టు శిక్షణ వంటి అంశాల ద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.మద్దిగట్ల- మోజర్ల ఉన్నత పాఠశాల గత రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమన్నారు.గ్రామంలోని బడి ఈడు గల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా పాఠశాల అభివృద్ధి కోసం సుమారు 500 మీటర్ల మేర కాంపౌండ్ వాల్ నిర్మాణం అవసరమని గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు యాదవ్, ఉపసర్పంచ్ రవి, ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్. వెంకట్స్వామి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజు, ఉపాధ్యాయులు విష్ణు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు బుచ్చిలింగం, నాగరాజు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments