పాలమూరు పర్యటనలో రేవంత్ పచ్చి అబద్ధాలు.
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
మహబూబ్నగర్,జూన్05(తెలంగాణ ముచ్చట్లు):
పాలమూరు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన సీఎం ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో బీఆర్ఎస్ హయాంలో రూ.35,200 కోట్ల విలువైన పనులు జరిగాయని, ప్రాజెక్టుపై కాంగ్రెస్ గతంలో పలు కేసులు వేసి అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు.రూ.27 వేల కోట్ల ఖర్చు జరిగిన విషయాన్ని సీఎం స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు.ప్రాజెక్టు కోసం అవసరమైన 27,100 ఎకరాల భూసేకరణలో 26,800 ఎకరాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, భూసేకరణ జరగలేదని చెప్పడం సరికాదన్నారు. ఎత్తిపోతల పథకాలలో ముందుగా పంపులు, లిఫ్టుల నిర్మాణమే చేపట్టాల్సి ఉంటుందని, వాటిపై సీఎం చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యాన్ని సూచిస్తున్నాయని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్వల టెండర్లు రద్దు చేయడం వల్ల ప్రాజెక్టుపై అదనంగా రూ.4 వేల కోట్ల భారం పడిందన్నారు.దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసి పాలమూరులో సాగునీటి విస్తరణకు కృషి చేసిందని తెలిపారు.గత 30 నెలల్లో ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన నిరంజన్ రెడ్డి, పాలమూరు పర్యటనలో సీఎం వాస్తవాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపిన అంశంపై సీఎం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రైతులకు త్వరగా నీరు అందేలా మిగిలిన పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


Comments