గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కీలకం.
వెల్టూర్ గ్రామ సర్పంచ్ అశోక్.
పెద్దమందడి,జూన్06(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ దండు అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ మరియు మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ దండు అశోక్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు.గ్రామసభలు ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు.గ్రామసభలో వర్షాకాల సన్నద్ధత మరియు ఆరోగ్య సంరక్షణ చర్యలు, సురక్షిత త్రాగునీటి నిర్వహణ, జల సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛత–పచ్చదనం కార్యక్రమాలు, వనమహోత్సవం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్), వరదల నివారణ మరియు భద్రతా చర్యలు, బడిబాట కార్యక్రమం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆయా కార్యక్రమాల విజయవంతానికి ప్రజల సహకారం అవసరమని అధికారులు వివరించారు.పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి గ్రామసభ అజెండా అంశాలను వివరించి, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజలు చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, ఎంపీడీవో పరిణత, ఎస్సై జలంధర్ రెడ్డి, వార్డు సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వివిధ శాఖ అధికారులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.


Comments