పారిశుద్ధ్యం, ఓటర్ల సవరణ, పంటల మార్పిడిపై అవగాహన కల్పించిన వార్డు సభ.
హుజూరాబాద్, జూన్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా హుజూరాబాద్ మున్సిపాలిటీ 13వ వార్డులో పారిశుద్ధ్యం, ఓటర్ల సవరణ (ఎస్ఐఆర్), పంటల మార్పిడి అంశాలపై వార్డు సభను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు, మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, స్థానిక కౌన్సిలర్ సందమల్ల పుణ్యబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు వార్డు ప్రజలకు పారిశుద్ధ్యం ప్రాముఖ్యత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, పంటల మార్పిడి విధానాలపై అవగాహన కల్పించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డ్రైనేజీలలో ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు వేయరాదని సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ చెత్త సేకరణ వాహనానికి అందించాలని కోరారు.
అలాగే కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ ఓటరు వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని, పంటల మార్పిడి విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ నరేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, వినయ్, వార్డు అధికారి నాగరాజు, జవాన్ కుమార్, మహిళా సమాఖ్య ఆర్పీ కొయ్యడ లక్ష్మి, ఆశా కార్యకర్త సరస్వతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలుగూరి సమ్మయ్య, కొయ్యడ రాకేష్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఉపేందర్, గొర్రె ఐల కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



Comments