గ్రామంలోకి ఎలుగుబంటి ఎంట్రీ అటవీ శాఖ చర్యల కోసం ఎదురుచూపులు.
ఎల్కతుర్తి, జూన్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ఎలుగుబంటి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మంగళవారం రాత్రి గ్రామంలోని ముస్లిం కాలనీలో ఎలుగుబంటి తిరుగాడిన ఘటనతో గ్రామంలో కలకలం నెలకొంది. ఎలుగుబంటి గ్రామంలోకి రావడంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తుల కథనం ప్రకారం, మూడు రోజుల క్రితం గ్రామ శివారులో వాకింగ్కు వెళ్లిన కొందరికి ఎలుగుబంటి కనిపించింది. దీంతో వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ ఘటన మరువకముందే మళ్లీ ముస్లిం కాలనీలో ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించడంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు.
ఎలుగుబంటి సంచారం కారణంగా సాయంత్రం వేళల్లో ఇళ్ల బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎలుగుబంటి ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో తెలియక గ్రామంలో భయభ్రాంతుల వాతావరణం నెలకొంది.
ఈ విషయాన్ని గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎల్కతుర్తి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. గ్రామంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని గుర్తించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించాలని వారు కోరుతున్నారు.
అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఎలుగుబంటి సంచారంపై నిఘా ఏర్పాటు చేసి, గ్రామస్తుల భద్రత కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఎలుగుబంటి బెడద నుంచి గ్రామస్తులకు ఉపశమనం కల్పించేందుకు అటవీ శాఖ త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూరారం ప్రజలు ఎదురుచూస్తున్నారు.


Comments