మోజర్లలో గ్రామసభ - బడిబాటకు విశేష స్పందన.
పెద్దమందడి,జూన్10(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో బుధవారం గ్రామసభతో పాటు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామంలో నెలకొన్న సమస్యలపై వివిధ శాఖల అధికారులు సమీక్ష నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, ఉపసర్పంచ్ రాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్తో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.బడిబాట కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు యుగంధర్ మాట్లాడుతూ.. మోజర్ల ప్రాథమిక పాఠశాలకు పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రం మంజూరైందని, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు చేరవచ్చని తెలిపారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ..గత రెండేళ్లుగా పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్య అందిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, గుడ్లు, రాగిజావా వంటి పౌష్టికాహారం అందిస్తున్నట్లు వివరించారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నందున బడి ఈడు గల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలని వారు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments