పార్టీ బలోపేతం, ఓటరు నమోదుపై నేతల దిశానిర్దేశం.
హుజూరాబాద్, జూన్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం, ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం హుజూరాబాద్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని, ఎస్ఐఆర్ ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటరు నమోదు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాలు, బూత్ల స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు.
సభ్యత్వ నమోదు, ఓటరు నమోదు కార్యక్రమాలపై మరింత విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న జమ్మికుంట పట్టణంలోని ఎంఫీఆర్ గార్డెన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. ఈ సమావేశానికి బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాల సాధన, ఓటరు నమోదు కార్యక్రమం విజయవంతం, సంస్థాగత బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు. సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Comments