బడీ బాటతో విద్యార్థుల వేట ఇంటింటికీ చేరిన ఎంఈఓ సత్యనారాయణ సందేశం.
ఎల్కతుర్తి, జూన్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపే లక్ష్యంగా చేపట్టిన బడీ బాట కార్యక్రమం ఎల్కతుర్తి మండలంలో జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల విద్యాధికారి (ఎంఈఓ) చదువుల సత్యనారాయణ తిమ్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులను కలిశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య గురించి వివరించి తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమ వేదికలని ఎంఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలతో కూడిన బోధన అందుతుందని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు, షూస్, బెల్టులు, మధ్యాహ్న భోజనం వంటి పలు సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు.
ప్రతి బడీడు పిల్లవాడు పాఠశాలలో చేరేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, సీఆర్పీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments