ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి.. వార్డు సభల్లో చైర్మన్ సందేశం.
1, 2, 3, 8వ వార్డు సభలకు హాజరైన మున్సిపల్ చైర్మన్ దిలీప్.
జమ్మికుంట టౌన్ జూన్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక పత్తిదారుల సంఘం భవనంలో 1, 2, 3, 8వ వార్డులకు సంబంధించిన వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో విలీనం అయిన ధర్మారం, రామన్నపల్లి గ్రామాల్లో రానున్న వర్షాకాలంలో వరద నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. "అమ్మ మనకు జన్మనిస్తే, మొక్కలు పునర్జన్మనిస్తాయి" అని పేర్కొన్నారు.
సభలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026, "జల్ సంచయ్ – జల్ భాగీదారి" కార్యక్రమం కింద వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, డ్రైనేజీల పూడికతీత, వర్షాకాల సన్నద్ధత కార్యాచరణ ప్రణాళిక, తాగునీటి సరఫరా, నీటి నిల్వల నివారణ, పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ, వీధి దీపాలు, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పదార్థాలు పిల్లల ఆరోగ్యవృద్ధికి, గర్భిణులు మరియు బాలింతల సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించారు. విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ మాట్లాడుతూ ప్రతి వార్డుకు లైన్మన్, జేఎల్ఎం సిబ్బంది అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యల పరిష్కారానికి సేవలందిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు పోలు దివ్య-బిక్షపతి, పోల్నేని శిల్ప-వేణుగోపాల్, కొలకని రాజకుమారి-రాజు, కొలుగురి సురేష్, రమేష్, వంశీ, శ్రీకాంత్, వార్డు అధికారులు, సీఏల్ఆర్పీలు, ఆర్పీలు, విద్యుత్ శాఖ అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, వార్డుల పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.


Comments