ముల్కనూర్ ఆర్టీసీ బస్ స్టేషన్ను సందర్శించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.
బస్ స్టేషన్ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ.
భీమదేవరపల్లి, జూన్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ ఆర్టీసీ బస్ స్టేషన్ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గురువారం సందర్శించారు. బస్ స్టేషన్లోని మౌలిక సదుపాయాలు, ప్రయాణికులకు అందుతున్న సేవలను పరిశీలించిన ఆయన, బస్ స్టేషన్ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులతో మాట్లాడిన నాగిరెడ్డి, ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్ స్టేషన్ అభివృద్ధి ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముల్కనూర్ గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, మాజీ ఎంపీపీ అశోక్ ముఖర్జీ, మాజీ మండల అధ్యక్షుడు ఊసకోయిల ప్రకాష్, యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ చిటుకూరి అనిల్, గణవేన కొమురయ్య,చిటుకూరి నితిన్ తదితరులు పాల్గొన్నారు.


Comments