గత అభివృద్ధి పనులు ప్రారంభం చేస్తూ ఆర్భాటాలు
ముఖ్యమంత్రి ప్రకటించిన 1000 కోట్ల నిధుల జాడ ఎక్కడ?
నందిమల్ల అశోక్, జిల్లా మీడియా కన్వీనర్
వనపర్తి,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు):
గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సాధించిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆర్భాటంగా ప్రారంభిస్తోందని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఘాటుగా విమర్శించారు. రెండు సంవత్సరాల పాలనలో కొత్తగా ఒక్క అభివృద్ధి పథకాన్ని కూడా చేపట్టలేకపోయారని ఆయన ఆరోపించారు. ప్రారంభం కానున్న హై లెవల్ బ్రిడ్జిలు, జి.పి భవనాలు వంటి ప్రాజెక్టులు గత ప్రభుత్వంలోనే మంజూరు చేయబడి కొన్నివరకు పూర్తి అయ్యాయని, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నవారు ప్రారంభించడం సహజమే అయినా, గతంలో మంజూరైన శంకుస్థాపన శిలాఫలకాలను అక్కడ ప్రతిష్ఠించి ప్రోటోకాల్ పాటించాలని అశోక్ సూచించారు.
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కృషితో పాలిటెక్నిక్ హాస్టల్ భవనం కోసం 22 కోట్లు, జె.ఎన్.టి.యు కాలేజ్ కోసం 32 కోట్లు, ఐటీ టవర్ కోసం 22 కోట్లు మంజూరైనా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే విధంగా పానగల్లు, కోడేరు, వనపర్తి మండలాల రైతుల ప్రయోజనాల కోసం రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణానికి 53 కోట్లు మంజూరైనా ప్రభుత్వం, నాయకులు నిర్మాణం ప్రారంభించకపోవడం రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని బహిర్గతం చేస్తోందని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి హాజరైన 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒక్కటి కూడా అమలు దిశగా సాగకపోవడం సిగ్గుచేటు విషయమని, ఆ శిలాఫలకాలు ఇప్పుడు దిష్టి బొమ్మలుగా మారిపోయాయని అశోక్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, జిల్లా మంత్రి కొత్త ప్రాజెక్టులు సాధ్యం కాకపోయినా, కనీసం గతంలో మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించేలా చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments