హనుమకొండలో అంగరంగ వైభవంగా తీజ్ ఉత్సవాలు
హన్మకొండ,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో తీజ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బంజారా కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ప్రతి సంవత్సరం 1500కు పైగా కుటుంబాల సమక్షంలో జరిగే ఈ పండుగలో సేవాలాల్ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన సింగ్ లాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, గుండ్ల సింగారంలో తీజ్ ఉత్సవాలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. బంజారా భవన్ నిర్మాణానికి వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తానని, అలాగే తీజ్ పండుగకు గవర్నమెంట్ హాలిడే ప్రకటించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఉత్సవాల్లో తీజ్ బుట్టల నిమజ్జనం అంగరంగ వైభవంగా జరగగా, ఆటపాట
లు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేదిక కళకళలాడింది. స్థానిక ప్రజలు, మహిళలు, యువత, కమిటీ సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments