గణేష్ ఉత్సవాల్లో డిజే సౌండ్లకు నో – కీసర పోలీసుల అవగాహన సమావేశం
కీసర, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు)
రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, భద్రంగా సాగేందుకు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు కీసర పోలీసులు డిజే ఆపరేటర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కీసర పోలీస్ స్టేషన్లో సీఐ ఏ. అంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సుమారు 30 మంది డిజే ఆపరేటర్లు హాజరయ్యారు.
సమావేశంలో గణేష్ మండపాల్లో డిజే సౌండ్ సిస్టమ్స్ వినియోగం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టంచేశారు. అధిక డెసిబెల్ శబ్దం ఆరోగ్యానికి హానికరం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి లౌడ్స్పీకర్లు, మ్యూజిక్ సిస్టమ్స్ వినియోగం నిషేధమని అధికారులు తెలిపారు.
సాంప్రదాయ పద్ధతుల్లో ఉత్సవాలు జరుపుకోవాలని, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో అందరూ సహకరించాలని పోలీసు అధికారులు డిజే నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాల సమయంలో భద్రతా బందోబస్తు పటిష్టంగా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసుల సూచనలను డిజే ఆపరేటర్లు సమర్థిస్తూ భవిష్యత్తులో నియమావళిని పాటిస్తామని హామీ ఇచ్చారు.


Comments