ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజ్గిరి, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి నియోజకవర్గంలో పేద మరియు మధ్యతరగతి ప్రజల వైద్య చికిత్స ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేయడం కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్కు చెందిన మల్లికార్జున్ కుటుంబానికి రూ. 2,00,000 విలువైన ఎల్ఓసి, గౌతమ్ నగర్ డివిజన్కు చెందిన ప్రియాంక కుటుంబానికి రూ. 2,50,000 విలువైన ఎల్ఓసి పత్రాలు మంజూరయ్యాయి. వీరిద్దరూ గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీఎం సహాయనిధి కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసిందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ,పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడకుండా, వారి ప్రాణాలను రక్షించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అమలు అవుతోంది. అవసరమైన ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితి త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, చిన్న యాదవ్, ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments