ఖవతీన్ ఇజ్తేమా వక్ఫ్ అవగాహన కార్యక్రమం ఘనంగా
నాగారం, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో సేవ్ వక్ఫ్ – సేవ్ రాజ్యాంగ ఉద్యమంలో భాగంగా ఖవతీన్ ఇజ్తేమా వక్ఫ్ అవగాహన కార్యక్రమం నాగారం స్టార్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. మహిళలు మరియు కళాశాల బాలికలకు ప్రత్యేకంగా ఈ సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు హజ్రత్ మౌలానా ఖలేద్ సైఫుల్లా రహ్మానీ సాహబ్ మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులు ముస్లింల సామాజిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి మూలస్తంభమని, వాటిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. 2025 వక్ఫ్ సవరణ చట్టం ముస్లిం సమాజ హక్కులను బలహీనపరిచే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో కల్పించిన మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కులు పరిరక్షించడంలో సమాజం ఐక్యంగా ఉండాలని సూచించారు.
జలీసా యాసీన్ సాహెబా (న్యాయవాది) అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో, మహిళలకు వక్ఫ్ చరిత్ర, చట్టపరమైన అంశాలు, మరియు సమాజ నిర్మాణంలో వక్ఫ్ పాత్రపై వివరణాత్మక అవగాహన కల్పించారు.
కార్యక్రమ నిర్వాహకుడు సయ్యద్ ఒమర్ షఫీక్ మాట్లాడుతూ, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఆదం షఫీక్, నాగారం మున్సిపాలిటీ ప్రతినిధులు, అనీస్ భాయ్, హబీబ్ భాయ్, ఖాజా భాయ్, గౌస్ భాయ్, అక్బర్ భాయ్, అజీమ్ భాయ్, మహమూద్ భాయ్, యూసుఫ్ భాయ్, ఇస్లాం భాయ్, రైస్ భాయ్, అష్రఫ్ భాయ్, హనీఫ్ భాయ్, షఫీ భాయ్ తదితర ముస్లిం ప్రముఖులు పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, విద్యార్థినులు వక్ఫ్ చట్టం పై అవగాహనతో పాటు సమాజ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు.


Comments